ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాళేశ్వరం ప్రాజ్టెకును శరవేగంగా పూర్తి చేయాలి : సీఎం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2017, 01:55 PM

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను గురు, శుక్రవారాల్లో విస్తృతంగా పర్యటించి పరిశీలించిన సీఎం.. ఈ పర్యటనలో తన దృష్టికి వచ్చిన అంశాలను శనివారం నాటి సమీక్షలో చర్చించి అధికారులకు, వర్కింగ్ ఏజెన్సీలకు దిశానిర్దేశం చేశారు. 


కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కాల్వలు, బ్యారేజీలు, టన్నెల్స్(సొరంగాలు), పంప్‌హౌజ్‌లు, సబ్‌స్టేషన్లు, స్విచ్‌యార్డు పనులను ఒక్కొక్కటిగా సీఎం సమీక్షించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అటవీ అనుమతుల్లో ఎలాంటి అవాంతరాలు లేనందున కాళేశ్వరం ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు ద్వారానే మంచి నీటి పథకమైన మిషన్ భగీరథ పనులు చేపడుతున్నందున పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు కేటాయించడంతో పాటు మరో రూ. 20 వేల కోట్లు బ్యాంకుల ద్వారా సమకూరుస్తున్నామని సీఎం తెలిపారు. 


కాళేశ్వరం ప్రాజెక్టుకు అతి తక్కువ సమయంలో అనుమతులను సాధించడానికి కృషి చేసిన అధికారులను సీఎం అభినందించారు. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల ద్వారానే హైదరాబాద్ సహా ఏడు పాత జిల్లాలకు సాగు, తాగునీరు అందించాలన్నారు. ఈ ప్రాజెక్టుకు చివరి దశ పర్యావరణ అనుమతులు త్వరలోనే వస్తాయన్నారు. అనుమతులు వచ్చే లోగా డిజైన్లు, ఇతర నిర్మాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. 


ఈ సమీక్ష సమావేశానికి మంత్రి హరీష్‌రావు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, నీటిపారుదల శాఖ సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు, బీహెచ్‌ఈఎల్, జెన్‌కో, ట్రాన్స్‌కో, అటవీశాఖ అధికారులతో పాటు వర్సింగ్ ఏజెన్సీలైన ఎల్ అండ్ టీ, నవయుగ, అఫ్కాన్, మెఘా వంటి కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com