ముంబై : బాలీవుడ్ నటి జైరా వసీమ్ వేధింపుల ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ సీరియస్ అయింది. జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ నుంచి ముంబైకి విస్తారా విమానంలో వసీమ్ వస్తుండగా.. తన పక్కనే ఉన్న సహచర ప్రయాణికుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. దీనిపై విస్తారా యాజమానాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ వివరణ కోరింది. ముంబైలో వసీమ్ బస చేస్తున్న హోటల్కి వెళ్లిన పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. వసీమ్పై సహచర ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించడం పట్ల జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్రస్థాయిలో స్పందించింది. జైరా వసీమ్ను వేధించిన వ్యక్తిపై విస్తారా సిబ్బంది చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి విస్తారాకు నోటీసులు ఇస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తెలిపారు. విస్తారాపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర డీజీపీకి కూడా నోటీసులు ఇచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. జైరా వసీమ్కు అన్ని విధాలా అండగా ఉంటామని రేఖా శర్మ స్పష్టం చేశారు.