హైదరాబాద్: సీబీఐటీ కళాశాలలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కళాశాల యాజమాన్యం భారీగా ఫీజులు పెంచిన నేపథ్యంలో గత నాలుగు రోజులుగా విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నిరసనలకు ఏబీవీపీ, పలు విద్యార్ధి సంఘాలు మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యం ఫీజుల పెంపు నూతన అడ్మిషన్లకు మాత్రమే వర్తించనున్నట్లు పేర్కొంది. అయినా విద్యార్థులు ఆందోళన విరమించడం లేదు. ఫీజులు తగ్గించినట్లు కళాశాల యాజమాన్యం సర్కులర్ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గండిపేట నుంచి సీబీఐటీ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు.