హైదరాబాద్ : రాయదుర్గం సొలపురియా నాలెడ్జ్ సిటీ పార్క్లో ప్రముఖ రియల్ ఎస్టేట్, ఆర్థిక సేవల సంస్థ సీబీఆర్ఈ కార్పొరేట్ కేంద్రాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు భారీ డిమాండ్ ఉందన్నారు. ఆఫీస్ స్పేస్ అబ్జార్షన్లో నగరంలో మంచి అభివృద్ధి సాధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్ విషయంలో 2015తో పోల్చితే 2017లో డిమాండ్ రెట్టింపు అయిందన్నారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై కంటే హైదరాబాద్ సురక్షితమైన నగరమని స్పష్టం చేశారు. భౌగోళిక పరంగాను హైదరాబాద్ ప్రపంచంలోనే బెస్ట్ సిటీ అని చెప్పారు. 19 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉప్పల్, ఆదిభట్ల వైపు పారిశ్రామికవేత్తలు దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్ తూర్పు వైపు కూడా అభివృద్ధికి అవకాశాలున్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రజారవాణాకు మెట్రో రైలు వంటి ఆధునిక సదుపాయాలు తెస్తున్నామని చెప్పారు. ఐటీ కారిడార్ లో మోనోరైలు తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రోకు అనూహ్యమైన స్పందన వస్తుందని తెలిపారు. మెట్రో రైలులో రోజుకూ లక్ష మందికి పైగా ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మెట్రోను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. మెట్రో మొదటి దశతో పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు వచ్చాయన్నారు. నూతన పారిశ్రామిక విధానం వల్ల పెట్టుబడులు అనేకం వచ్చాయన్నారు. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.