మేడ్చల్ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం కావాలని కోరుతూ మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి చిలుకూరు బాలాజీ స్వామిని మంగళవారం ఉదయం దర్శించుకుని 108 ప్రదక్షిణలు చేశారు. అలాగే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలతో పాటు యావత్తు తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని చిలుకూరు బాలాజీని మొక్కుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సుపరిపాలనతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని, మున్ముందు మరింత సుభిక్షంగా మారాలని కోరుకున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.