హైదరాబాద్: ప్రగతిభవన్లో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ హోంగార్డులతో సమావేశమయ్యారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డితోపాటు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ హైదరాబాద్ వంటి నగరాల్లో రూ.12 వేల జీతంతో కష్టమని సీఎం అన్నారు. మన ఆదాయం అంతా మన ప్రజలకు చెందాలనే లక్ష్యంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడామని సీఎం స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి ప్రత్యేక కానిస్టేబుల్ నియామకాల్లో హోంగార్డులకు 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రిజర్వ్డ్ కానిస్టేబుళ్ల నియామకంలో హోంగార్డులకు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. డ్రైవర్ల నియామకంలో హోంగార్డులకు 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. రోస్టర్ విధానం లేకుండా ఎలాంటి నియామక ప్రక్రియ జరగొద్దని ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. రోస్టర్ అమలు చేస్తూనే హోంగార్డులపై నియామక అధికారులు కాస్త దయ చూపాలన్నారు. పరీక్ష కూడా సాధారణ అభ్యర్థులతో కాకుండా హోంగార్డులకు ప్రత్యేకంగా నిర్వహించాలని నిర్దేశించారు.