మొహాలీః రోహిత్శర్మ చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఏకంగా మూడో డబుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి వన్డేలో చిత్తుగా ఓడిన కసో ఏమోగానీ.. రెండో వన్డేలో శ్రీలంక బౌలర్లను ఊచకోత కోశాడు స్టాండిన్ కెప్టెన్ రోహిత్. ఆ బౌలర్ ఈ బౌలర్ అన్న తేడా లేదు.. అందరినీ చితక బాదాడు. కేవలం 151 బంతుల్లోనే 13 ఫోర్లు, 12 సిక్సర్లతో వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ చేశాడు. చివరికి 153 బంతుల్లో 208 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో రెండో వన్డేలో శ్రీలంకకు 393 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. గతంలోనే రోహిత్శర్మ రెండుసార్లు డబుల్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. ఇదే శ్రీలంకపై గతంలో 264 పరుగులు చేశాడు రోహిత్. వన్డేల్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరుగా ఉంది. రోహిత్కు తోడు శ్రేయాస్ అయ్యర్ 70 బంతుల్లో 88, శిఖర్ ధావన్ 67 బంతుల్లో 68 రన్స్ చేశారు.
సెంచరీని 115 బంతుల్లో సాధించిన రోహిత్.. తర్వాత చెలరేగిపోయాడు. తర్వాతి సెంచరీని కేవలం 36 బంతుల్లోనే కొట్టడం విశేషం. సెంచరీ తర్వాతే అతను పది సిక్సర్లు బాదాడంటే రోహిత్ ఊచకోత ఏ రేంజ్లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. రోహిత్ దెబ్బ లంక బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. నువాన్ ప్రదీప్ ఏకంగా 10 ఓవర్లలో 106 పరుగులు ఇచ్చాడు. పెరీరా 8 ఓవర్లలో 80, లక్మల్ 8 ఓవర్లలో 71 పరుగులు ఇచ్చారు.