తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. శుక్రవారం సాయంత్రం కన్నులపండవగా జరగనున్న వేడుకలతో ఈ తెలుగు పండుగ ఆరంభంకానుంది. ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై తెలుగు మహాసభలను ప్రారంభిస్తారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగు మహాసభలను నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం ఈ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈనెల 19వ తేదీ వరకు జరగనున్న ఈ వేడుకల ద్వారా తెలంగాణలో తెలుగు భాషావికాసం, సాహితీమూర్తుల ప్రతిభా విశేషాలను ప్రపంచానికి చాటనుంది.
అదిరేలా వేదికల అలంకరణ..
ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్న వేదికల అలంకరణ ఏర్పాట్లు గురువారం రాత్రి పూర్తయ్యాయి. ఎల్బీ స్టేడియంలో ప్రారంభవేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దీనిలో భాగంగా ఎల్బీ స్టేడియాన్ని రూ.70 లక్షల ఖర్చుతో అందంగా అలంకరించారు. తెలంగాణ సంస్కృతిని చాటేలా వేదికను సిద్ధం చేశారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఇక మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు, తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందినీ సిధారెడ్డిలు వేదికపై ఆశీనులు అవుతారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ముఖ్యఅతిథులు పాల్గొంటారు.