కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపితే.. మోదీ మధ్యయుగంలోకి తీసుకెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రధాని దేశాన్ని తిరోగమనంలో నడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోంది. కానీ మేం అలా కాదన్నారు. కమలం పార్టీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతోందని రాహుల్ ఆరోపించారు.. బీజేపీ హింసను ప్రేరేపిస్తోందన్నారు.
దేశ ప్రజల పట్ల నమ్మకంతోనే 13 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టానని రాహుల్ తెలిపారు. ప్రస్తుత రాజకీయాలు ప్రజాసేవకు ఉపయుక్తంగా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలను సోదరులుగా, సోదరీమణులుగా భావిస్తాం. వారిని గౌరవిస్తాం, కానీ వారితో ఏకీభవించమని రాహుల్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇతరులను నిందించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీని నిలువరించేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమేనని రాహుల్ తెలిపారు.