హైదరాబాద్ : ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటున్న కాంగ్రెస్ నాయకులూ… అవినీతిపై బహిరంగ చర్చకు నేను రెడీ… మీరు సిద్దమనా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… 2009లో ఒక్క ప్రాజెక్టుకు నాలుగు చోట్ల శంకుస్థాపన చేశారన్నారు. నాలుగేళ్లలో ప్రాణహిత చేవెళ్ల పూర్తి చేస్తామని చెప్పి 2014 వరకు పూర్తి పనులు మొదలు పెట్టలేదన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్సుల ద్వారా కాంగ్రెస్ నేతలు, గుత్తేదారులు దోచుకున్నారన్నారు. తెలంగాణ నీళ్లను దోచుకునే దుమ్ముగూడెం ప్రాజెక్టుకు సహకరించలేదా అని ప్రశ్నించారు. తట్టెడు మట్టిని ఎత్తకుండా దుమ్ముగూడెం ప్రాజెక్టుపై బిల్లులు ఎత్తారన్నారు. ప్రాజెక్టుల్లో అవినీతి గురించి కాంగ్రెస్ వాళ్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆన్ లైన్ ఈ ప్రొక్యూర్ మెంట్ టెండర్ల ద్వారా పనులు అప్పగించామన్నారు. ఆంధ్రా కంపెనీలను పెంచి పోషించింది కాంగ్రెస్ నేతలు కాగా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు నవరత్నాలుగా పేర్కొన్న కంపెనీల్లో ఒక్కటైనా తెలంగాణ సంస్థ ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా రూ.1.50లక్షల కోట్ల పనులకు టెండర్లు పిలిచి ఒక్క తెలుగు సంస్థకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. అవినీతికి ఆస్కారముండే ఈపీసీ విధానాన్ని ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు.