చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువైన బాసరలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి అమ్మవారికి మహా నివేదన హారతి నిర్వహించిన సమయంలో అమ్మవారి నామస్మరణ చేస్తూ భక్తులు పారవశ్యంలో మునిగి పోయారు. అమ్మవారు నిన్న కాలరాత్రి అవతారములో భక్తులకు దర్శనమివ్వగా భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. ఎనిమిదో రోజైన బుధవారం సరస్వతి అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచే పండితులు అమ్మవారికి వేద మంత్రోచ్ఛరణలతో విశేష పూజలు నిర్వహించారు. వేద పండితులు ఉదయం 7 గంటల నుండి కుంకుమార్చన, చిన్నారులకు అక్షరాభ్యాసం పూజలు చేపడుతున్నారు. రాత్రి రెండు గంటల నుంచి మహర్నవమి ఘడియలు రావడంతో అమ్మవారి యాగ శాలలో హోమం ప్రారంభించి రేపు ఉదయం 6 గంటలకు పూర్ణాహుతితో పూర్తి చేస్తారు. అనంతరం అమ్మవారికి అభిషేకం, దేవి మహాపూజ కార్యక్రమం పూజలు జరుపుతారు.