తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య శబరిమల కొండపైకి తెలుగు మహిళా జర్నలిస్టుతో పాటు కొచ్చికి చెందిన మరో మహిళా భక్తురాలు వెళ్తున్నారు. వీరిద్దరూ పోలీసుల సంరక్షణల మధ్య పంబ నుంచి కొండపైకి బయల్దేరారు. రుతుస్రావం అయ్యే మహిళలకు శబరిమల కొండపైకి వెళ్లడం నిషేధమైనప్పటికీ.. గత నెలలో అన్ని వయసుల మహిళలు శబరిమలకు వెళ్లొచ్చని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఒక వేళ వీరిద్దరూ కొండపైకి వెళ్తే.. చరిత్ర సృష్టించినట్టే. వీరిద్దరూ వయసు పాతిక ఏళ్లు మాత్రమే.
హైదరాబాద్కు చెందిన మోజో టీవీలో రిపోర్టర్గా పని చేస్తున్న కవిత ఇవాళ ఉదయం 100 మంది పోలీసుల సహాయంతో శబరిమల కొండ ఎక్కుతున్నారు. పంబ వద్ద మోజో టీమ్పై ఆందోళనకారులు దాడి చేశారు. మహిళా జర్నలిస్టులు కొండపైకి అడుగుపెడితే తర్వాత జరిగే చర్యలకు పోలీసులే బాధ్యత వహించాలని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. మహిళా జర్నలిస్టుకు ఐజీ శ్రీజిత్ ఆధ్వర్యంలో పోలీసుల బృందం రక్షణ కల్పిస్తోంది. కొచ్చికి చెందిన మహిళా భక్తురాలు.. నల్లటి దుస్తులు ధరించారు. అయ్యప్పను వేడుకుంటూ కొండమీదకు బయల్దేరారు. నిన్న ఉదయం న్యూయార్క్ టైమ్స్కు చెందిన మహిళా జర్నలిస్టులు శబరిమల కొండపైకి ఎక్కుతుంటే మధ్యలో ఆందోళనకారులు అడ్డుకోవడంతో వారు వెనుదిరిగిన విషయం తెలిసిందే.