భువనేశ్వర్ : తిత్లీ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశా రాష్ర్టానికి ఆర్థిక సాయం కోసం ప్రధాని నరేంద్ర మోదీకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఓ లేఖ రాశారు. తిత్లీ తుపాను సహాయ చర్యలు, పునరుద్ధరణ పనులకు సహకరించాలని వినతి చేశారు. తక్షణ సాయంగా రూ. వెయ్యి కోట్లు విడుదల చేయాలని మోదీని ఒడిశా సీఎం కోరారు.
తిత్లీ తుపాను మృతుల సంఖ్య 57కు చేరింది. ఈ తుపాను కారణంగా ఒడిశాలోని 16 జిల్లాల్లో 57,131 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో ఇప్పటికీ కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదలు కూడా వస్తున్నాయని అక్కడి అధికారులు వెల్లడించారు. 60.11 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ఉంటున్నారు. ఇండ్లు దెబ్బతిన్న వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సాయం చేయాలని మోదీని నవీన్ పట్నాయక్ కోరారు. తిత్లీ తుపాను వల్ల భారీ స్థాయిలో ఆస్తి నష్టం జరిగింది.