ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీలోకి నందీశ్వర్ గౌడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 19, 2018, 12:54 PM

మహాకూటమిలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. మరో వారం రోజుల్లో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంది. 12 నుంచి 15 సీట్లలో టీ టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీ టీడీపీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థులను జాబితాను తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్‌కు ఇచ్చిందని... దీనిపై కాంగ్రెస్ కసరత్తు కూడా మొదలుపెట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో చర్చలు జరగలేదని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ టీడీపీలో చేరుతుండటంతో... ఆయనకు టీడీపీ తరపున టికెట్ ఖరారైందనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. 


కాంగ్రెస్ తరపున పటాన్‌చెరువు ఎమ్మెల్యేగా వ్యవహరించిన నందీశ్వర్ గౌడ్... ఆ తరువాత కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్, ఆ తరువాత బీజేపీలో చేరారు. అయితే ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడం ఆసక్తికరంగా మారింది. టీడీపీ తరపున టికెట్‌ విషయంలో స్పష్టమైన హామీ లభించిన తరువాతే ఆయన సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. పొత్తుల్లో భాగంగా టీడీపీ తరపున ఆయన పటాన్‌చెరువు, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు కాంగ్రెస్ నుంచి టికెట్ విషయంలో స్పష్టమైన హామీ లభించకపోవడం వల్లే ఆయన కాంగ్రెస్‌లోకి కాకుండా టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరబోతున్న నందీశ్వర్ గౌడ్‌కు మహాకూటమి తరపున టికెట్ వస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com