హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమర శంఖం పూరించింది. ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరి కాసేపట్లో నిర్మల్ జిల్లాలో తొలి పర్యటన చేయనున్నారు. బైంసా పట్టణం రాహుల్ బహిరంగ సభకు వేదికగా మారింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత రామారావు పటేల్ విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాహుల్ సభకు సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని, సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పటేల్ చెప్పారు. రాహుల్ పర్యటన విజయవంతం చేయడం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని సీట్లను గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు రామారావు పటేల్ పేర్కొన్నారు.