తమ కొత్త దోస్త్ చంద్రబాబును ప్రశంసల్లో ముంచెత్తారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు. మహాకూటమిలో సీట్ల పంపకంపై పంతానికి పోవద్దని తెలంగాణ టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించడం హర్షణీయమని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ను గద్దె దించేందుకు సీట్ల త్యాగాలకు సిద్ధమని ప్రకటించిన చంద్రబాబు...సీట్ల విషయంలో టీజేఎస్, సీపీఐ కూడా సానుకూలంగా ఆలోచించాలని సూచించారు. తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్కు సానుకూలంగా ఉందని, ఈ సానుకూల వేవ్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
టీ.టీడీపీ నేతలకు చంద్రబాబు చేసిన సూచనను తాను అభినందిస్తున్నట్లు వీహెచ్ చెప్పారు. సీఎం కేసీఆర్ను గద్దె దించేందుకు రెండు సీట్లు తక్కువైనా ఫర్వాలేదుకానీ...మహాకూటమిలో కలిసి పోరాడుదామన్న చంద్రబాబు ఆలోచన మంచిదన్నారు. చంద్రబాబును కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడినా...చంద్రబాబు ఎప్పుడూ కేసీఆర్ను ఒక్క మాట అనలేదని అభినందించారు. సీట్ల పంపకాల విషయాంలో ప్రతిష్టంభనను సాగనీయకుండా...మహాకూటమి భాగస్వామ్యపక్షాలు వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. మహాకూటమిలో సీట్ల కేటాయింపుల ప్రక్రియ ఆలస్యమైతే అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్నారు.
అటు బీసీలకు సంబంధించి దిల్లీ సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై కూడా వీహెచ్ స్పందించారు. ఈ విషయమై స్క్రీనింగ్ కమిటీ సభ్యులైన భక్త చరణ్దాస్, పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డిని అడుగుతానని చెప్పారు. తనతో పాటు పొన్నాల లక్ష్మయ్య, ఆనంద్ భాస్కర్ను ఎందుకు ఆహ్వానించలేదో వారు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు 34 సీట్లు కేటాయించాలని అధిష్ఠానాన్ని కోరతామన్నారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రెండేసి సీట్ల చొప్పున అడుగుతున్నట్లు వీహెచ్ తెలిపారు.