హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంత రావు అన్నారు. రాఫెల్ డీల్లో 30 వేల కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. యుద్ధ విమానాల తయారీలో అనిల్ అంబానీ సంస్థకు అనుభవం లేదని విహెచ్ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంటులో రాఫెల్ డీల్పై వేసిన ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానమివ్వలేదని ఆయన చెప్పారు. మోడీ మౌనంగా ఉన్నారంటే కుంభకోణాన్ని అంగీకరించినట్లేనని ఆయన అన్నారు. రాఫెల్ డీల్ అంశంపై ధర్నా చౌక్లో మహాకూటమి నేతలు ధర్నా చేపట్టారు. ధర్నాచౌక్లో ఎలాంటి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టరాదంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు హైకోర్టు కొట్టివేసిన తరువాత విహెచ్ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా జరుగుతోంది.