ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ మెట్రో కొత్త రికార్డు..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 16, 2018, 02:51 PM

హైదరాబాద్ మెట్రో రైలుకు ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. రెండో దశలో ఎల్బీ నగర్ నుంచి అమీర్‌పేటకు మెట్రో సేవలు విస్తరించడంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ప్రయాణికుల సంఖ్యలో మెట్రో అరుదైన రికార్డును అందుకుంది. ప్రారంభమైన ఏడాదిలోపే ఏకంగా 30 మిలియన్ల (మూడు కోట్లు) ప్రయాణికుల మైలురాయిని చేరింది. ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈనెల 14 వరకు మూడు కోట్ల మంది ప్రయాణికులు మెట్రో రైలు ద్వారా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరారు. 


ఈ ఘనతను అందుకోవడంపై ఎల్‌ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘మా అందరికీ ఇది ఎంతో సంతోషకరమైన క్షణం. 351 రోజుల్లో 30 మిలియన్లకు పైగా ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాం. 71 రోజుల్లోనే ప్రయాణికుల సంఖ్య 20 మిలియన్ల నుంచి 30 మిలియన్లకు చేరింది. రోజుకు 550 ట్రిప్పులతో సుమారు 13వేల కిలోమీటర్ల మేర రైళ్లను నడిపాం. మా ఉద్యోగులు, ఓ అండ్ ఎం ఆపరేటర్ కియోలిస్ కఠోర శ్రమ, ప్రోత్సాహం, సహకారంతోనే ఇది సాధ్యపడింది’ అని కేవీబీ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. 


కాగా, హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసులు ఇప్పటివరకు 1,64,198 ట్రిప్పులతో 25,53,422 కిలోమీటర్ల మేర తిరిగాయి. మెట్రో సమయపాలన (పంక్చువాలిటీ)లో 99.7 శాతం రేటును సాధించడంతోపాటు రైలు సర్వీసుల డెలివరీలో 99.9 శాతం రేటింగ్ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే, మెట్రో ప్రారంభమైన 154 రోజులకి (ఈ ఏడాది మే1 నాటికి) ప్రయాణికుల సంఖ్య కోటికి చేరింది. ఆ తరవాత 280 రోజులకి (సెప్టెంబర్ 4 నాటికి) ప్రయాణికుల సంఖ్య రెండు కోట్లకు చేరింది. చివరిగా 351 రోజుల్లో మూడు కోట్ల ప్రయాణికుల మైలురాయిని మెట్రో అందుకుంది. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com