హైదరాబాద్ : కాంగ్రెస్ తుది విడత జాబితాపై కసరత్తు ముగిసింది. మూడో విడత జాబితాను రేపు విడుదల చేయనుంది. ఢిల్లీలోని కర్ణాటక భవన్లో స్క్రీనింగ్ కమిటీతో ఖుంతియా, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ ముగిసింది. పెండింగ్లో ఉన్న 19 నియోజక వర్గాల అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి వచ్చారు. దీనిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదముద్ర వేయాల్సి ఉంది.
మొత్తం 119 స్థానల్లో 25 సీట్లను మిత్రపక్షాలకు పంచిన కాంగ్రెస్.. ఈ ఎన్నికల్లో 94 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇప్పటి వరకు రెండు విడతల్లో 75 మంది అభ్యర్థులను ప్రకటించింది. కొన్ని చోట్ల అసంతృప్తుల జ్వాల రగిలింది. మరోవైపు టీజేఎస్ కొన్ని స్థానాల కోసం పట్టుపట్టడం, ఇప్పటికే ప్రకటించిన నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల పోటీ చేస్తామని ప్రకటించడం కాంగ్రెస్కు మింగుడు పడని అంశంగా మారింది. ఈ నేపథ్యంలో మూడో విడత జాబితాకు తీవ్రస్థాయిలో చర్చలు, సంప్రదింపులు జరిగాయి. అసంతృప్తులకు అన్యాయం చేయబోమని ఏఐసీసీ నేత బోస్ రాజు స్పష్టం చేశారు.