ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి సవాల్ విసిరారు. ఛత్తీస్ గఢ్ లోని అంబికాపూర్ లో ఈ రోజు జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్ మోడీ దమ్ముంటే తనతో 15 నిమిషాల పాటు చర్చలో కూర్చోవాలని సవాలు విసిరారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై ప్రధానికి తనతో బహిరంగ చర్చలో కూర్చునే ధైర్యం లేదని రాహుల్ వ్యాఖ్యానించారు. మోదీ అర్థరాత్రి సీబీఐ చీఫ్ ను తొలగించి ఆ సంస్థ ప్రతిష్ఠను మరింత మంటగలిపారని.. కేవలం సీబీఐనే కాకుండా రిజర్వు బ్యాంకు, ప్రభుత్వ సంస్థలు, సుప్రీంకోర్టు సహా అన్ని ప్రభుత్వ వ్యవస్థలను మోదీ భ్రష్టు పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని దుయ్యబట్టారు. తన ప్రశ్నలకు ప్రధాని మోదీ వద్ద సమాధానాలు లేవనీ, అందుకే ఆయన చర్చకు రావడంలేదని రాహుల్ గాంధీ అన్నారు.