సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి చెందింది అంటే కేవలం ముత్యంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కృషితోనే సాధ్యమైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డితో మంత్రి హరీశ్ రావు భేటీ అయ్యారు. టీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు తొగుటలోని ముత్యంరెడ్డి నివాసానికి హరీశ్రావు వెళ్లారు. ఈనెల 20న సిద్దిపేటలో సీఎం కేసీఆర్ సమక్షంలో ముత్యంరెడ్డి టీఆర్ఎస్లో చేరనున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ముత్యంరెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని ముత్యంరెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. సీనియర్ నాయకులు కంటతడి పెట్టొదంటూ ముత్యంరెడ్డిని హరీశ్రావు సముదాయించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. టీఆర్ఎస్లో చేరికపట్ల సీనియర్ నాయకులు ముత్యంరెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎల్లుండి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. మాజీ మంత్రి చేరికతో ఉమ్మడి మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతమైందని హరీశ్ తెలిపారు. నాకు తప్పు చేయడం తెలియదు, లంచాలు తీసుకోలేదని ఈ సందర్భంగా ముత్యంరెడ్డి పేర్కొన్నారు.