హైదరాబాద్: యువ నాయకుడు కాసాని వీరేష్ బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డా. కే.లక్ష్మణ్ వీరేష్ ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి, కండువా కప్పారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ వీరేష్ రాకతో రంగారెడ్డి జిల్లాలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. యువ నాయకులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే దానికి వీరేష్ చేరికే ఉదాహారణ అని, రానున్న రోజుల్లో తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా నాయకత్వంలో బీజేపీ తిరుగులేని శక్తిగా మారుతోందని అన్నారు. కాగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా వీరేష్ బరిలోకి దిగుతారని అనుకున్నారు. మహా కూటమి పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయించడంతో బీజేపీ వైపు మొగ్గు చూపారు. అభిమానులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఆయన బీజేపీలో చేరారు.