మూడు రోజుల క్రితం కోదాడ నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగాలన్న ఉద్దేశంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చి నామినేషన్ దాఖలు చేయకుండా వెళ్లిపోయిన కమేడియన్ వేణుమాధవ్, నేడు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. తన మద్దతు దారులతో కలసి వచ్చిన ఆయన, తన స్వస్థలం ఇదే కావడంతో, ఇక్కడి నుంచే బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్టు మీడియాకు తెలిపారు. కాగా, మూడు రోజుల క్రితం తగిన పత్రాలు లేవంటూ అధికారులు వేణు మాధవ్ నామినేషన్ ను తీసుకోలేదన్న సంగతి తెలిసిందే. నేడు ఈసీ నిర్దేశించిన విధంగా ఆయన నామినేషన్ పత్రాలను తయారు చేయించి తీసుకురావడంతో, వాటిని పరిశీలనకు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.