కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్వగ్రామం కొండారెడ్డిపల్లి నుంచి సోమవారం ఉదయం కొడంగల్ చేరుకున్న ఆయన వేలాదిమంది కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. కొడంగల్లోని తన నివాసం వద్ద వివిధ మండలాలు, గ్రామాల నుంచి వచ్చిన వేలాదిమంది కార్యకర్తలతో కాసేపు ముచ్చటించిన ఆయన తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు. అనంతరం భారీ ర్యాలీగా కొడంగల్లోని ప్రధాన రహదారి మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ కుమారికి నామ పత్రాలను అందజేశారు. రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో మహాకూటమి పక్షాలైన తెదేపా, సీపీఐ పార్టీల కార్యకర్తలు, నేతలు హాజరయ్యారు. తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్ రెడ్డి సైతం రేవంత్ రెడ్డి ర్యాలీలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు. నామినేషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రేవంత్రెడ్డితో పాటు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చేందుకు పార్టీ కార్యకర్తలు ఉత్సాహం చూపడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ భారీ ర్యాలీతో రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. బాణసంచా మోతతో మహాకూటమి శ్రేణులు హోరెత్తించాయి.
ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. గతంలో తాను నామినేషన్ వేసినప్పుడు ఇప్పుడు వచ్చిన జనంలో సగం మంది కూడా రాలేదన్నారు. ఇంతమంది ప్రజల భావోద్వేగాలతో కూడిన నామినేషన్ తన జీవితంలో వేస్తాననుకోలేదన్నారు. తన జీవితంలో తుదిశ్వాస వరకు, చివరి రక్తపు బొట్టు వరకు కొడంగల్ ప్రజల కోసమే పనిచేసేందుకు తనకు భగవంతుడు అవకాశం ఇచ్చాడన్నారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఎక్కడో మారుమూలన విసిరేసిన కొడంగల్కు గల్లీ నుంచి దిల్లీ దాకా గుర్తింపు తీసుకొచ్చేలా అభివృద్ధి కోసం, నిధుల కోసం పోరాటం చేశామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోందని ఆశాభావం వ్యక్తంచేశారు. రాబోయే ప్రభుత్వంలో కొడంగల్ నియోజకవర్గ ప్రజలది కీలక భూమిక ఉంటుందని, రాష్ట్ర రాజకీయాలను శాసించే పట్టు కొడంగల్ ప్రజలు సాధించబోతున్నారని చెప్పారు. ప్రజలు ఇచ్చిన గుండె ధైర్యంతో వినిపిస్తున్న తన గళాన్ని మూగబోయేలా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుని క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం కాంగ్రెస్ కార్యకర్తలే ఇవ్వాలన్నారు. కొడంగల్కు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు.. ఎవరు వచ్చినా దీటుగా ఎదుర్కొంటానన్నారు. కొడంగల్ ప్రజలకు తాను హైటెన్షన్ వైరులా కాపాలా ఉంటానన్నారు. కొడంగల్ ప్రజలు విజ్ఞులని, కాసులకు అమ్ముడుపోయేవాళ్లు అసలే కాదన్నారు. ధర్మం గెలుస్తుందో, అవినీతి మూటలు గెలుస్తాయో డిసెంబర్ 11న కురుక్షత్రం ఫలితాలు వెల్లడయ్యాక తెలుస్తుందన్నారు.