హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచార హోరుకు నేటితో తెరపడనున్నది. సాయంత్రం ఐదు గంటలకు ప్రచార గడువు ముగుస్తుంది. ఆ తర్వాత సభలు, సమావేశాలు నిర్వహించేందుకు వీల్లేకపోవడంతో ఎక్కడి మైకులు అక్కడే మూగబోతాయి. బార్లు, మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని ఎన్నికల కమిషన్ (ఈసీ) ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇతర జిల్లాల వ్యక్తులు, రాజకీయ నేతలంతా ప్రచార గడువు ముగిసిన వెంటనే తమతమ ప్రాం తాలకు వెళ్లిపోవాలని, స్థానికులు తప్ప కొత్తవారు జిల్లాల్లో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేసే ప్రకటనలపై నిషేధం విధించింది. ప్రింట్ మీడియాలో మాత్రం షరతులతో కూడిన అనుమతులతో ప్రకటనలు జారీచేయవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్కుమార్ పేర్కొన్నారు.
ఈ నెల 7వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నందున 48 గంటల ముందే అన్నిరకాల ప్రచారాన్ని ఆపేయాలని ఈసీ ఆదేశించింది. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలైన 13 సమస్యాత్మక నియోజకవర్గాల్లో పోలింగ్ను సాయంత్రం 4 గంటలకే ముగించనున్న విషయం తెలిసిందే. దీంతో ఆ 13 నియోజకవర్గాల (సిర్పూర్కాగజ్నగర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం) పరిధిలో నేడు సాయంత్రం 4 గంటలకే ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలని, మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చని ఈసీ స్పష్టంచేసింది. గడువు దాటిన తర్వాత ఎవరైనా ప్రచారం కొనసాగించినా, సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించినా కఠిన చర్యలు చేపడుతామని హెచ్చరించింది. సినిమా థియేటర్లు, టీవీలు ఇతర మాధ్యమాల ద్వారా ఎన్నికల సందేశాలను ప్రసారంచేయడాన్ని నేరంగా పరిగణిస్తామన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి సర్వేలను ప్రసారం చేయరాదని పేర్కొన్న ఎన్నికల కమిషన్.. బల్క్ ఎస్సెమ్మెస్లనూ నిషేధించింది. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో వినోద కార్యక్రమాలు, కచేరీలు నిర్వహించరాదని స్పష్టంచేసింది. నిబంధనలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేరొన్నది.