రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు అదనపు డీజీ జితేందర్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై ఆయన స్పందిస్తూ.. రాష్ర్టానికి కేంద్ర బలగాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి బలగాలు వచ్చాయన్నారు. ఇప్పటి వరకు రూ. 120 కోట్లకు పైగా నగదు.. రూ. 2.04 కోట్ల విలువచేసే 4 లక్షల లీటర్ల మద్యం.. రూ. 6.70 కోట్ల విలువ చేసే వస్తువులు.. 146.6 గ్రాముల ప్లాటినం, 689 గ్రాముల వజ్రాలు.. 17.56 కిలోల బంగారం, 106.32 కిలోల వెండి... 266 కిలోల గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
4 వేలకు పైగా సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు. తెలంగాణలో మావోయిస్టుల ప్రభావం తక్కువగా ఉందన్న ఆయన కావాల్సినంత భద్రతా సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11,853 నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయినట్లు.. 8,481 లైసెన్సు ఆయుధాలను డిపాజిట్ చేసుకున్నట్లు తెలిపారు. నిఘా పర్యవేక్షణకు 414 ఫ్లయింగ్ స్వాడ్లు, 404 ప్రత్యేక బృందాలు, 3,385 సంచార బృందాలు విధుల్లో ఉన్నట్లు చెప్పారు. ఇవాళ పోలింగ్ కేంద్రాలకు సామాగ్రి తరలించనున్నట్లు వెల్లడించారు.