ఉత్తర్ప్రదేశ్లోని బహ్రయిచ్ లోక్సభ నియోజకవర్గం ఎంపీ సావిత్రిబాయి ఫూలే భాజపాకు రాజీనామా చేశారు. భాజపా తన సిద్ధాంతాలతో సమాజాన్ని విభజించాలని చూస్తోందని, అందుకే రాజీనామా చేసినట్లు సావిత్రిబాయి తెలిపారు. అయితే తాను పార్టీ సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేస్తున్నానని, తన పదవీకాలం ముగిసేంత వరకు లోక్సభ సభ్యురాలిగా కొనసాగుతానని ఆమె తెలిపారు. దళితుల హక్కులను భాజపా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఈ అంశంపై ఈ నెల 23న లఖ్నవూలో మెగా ర్యాలీ నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆమె చెప్పారు.హనుమంతుడి కులం విషయమై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్పై విమర్శలు చేసి సావిత్రిబాయి ఫూలే వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇటీవల రాజస్థాన్లోని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యోగి.. హునుమంతుడు దళితుడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సావిత్రిబాయి స్పందిస్తూ సీఎం యోగిపై విమర్శలు చేశారు. హనుమంతుడు రాముడికి భక్తితో ఎంతో చేసినప్పుడు.. ఆయనను మనిషిలా చేయాలి, కానీ కోతిలాగా చేశారు. దళితులను ఎందుకు మనుషులుగా పరిగణించరు? అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. కాగా.. సావిత్రిబాయి సొంతపార్టీపైనే విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను ‘మహా పురుషుడు’ అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు.