తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నాలుగో రోజు సభలో కేసీఆర్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా ప్రతిపక్ష నేతలు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
ప్రజలకు మేలు చేసే సంక్షేమ, అభివృద్ది పథకాలు ఎవరు తీసుకొచ్చినా మెచ్చుకోవాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం కంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకమే ఎన్నో రెట్లు మెరుగైందన్నారు.
ఆరోగ్య శ్రీ పథకం చాలా మంచి పథకమని చెప్పిన కేసీఆర్.. అందుకే ఎటువంటి మార్పులు చేయకుండా దాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం ఉంది కాబట్టే.. కేంద్రం అమలుచేస్తున్న ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరలేదని తెలిపారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో లాటరీ పద్దతిని అమలుచేస్తామని కేసీఆర్ చెప్పారు. గత లెక్కల ప్రకారం 8లక్షల మందికి ఇళ్లు నిర్మించాల్సి ఉందన్నారు. అయితే ఖచ్చితమైన లెక్కను త్వరలోనే తేలుస్తామన్నారు. ఇప్పటికే 2.70 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని గుర్తుచేశారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్లే గిరిజన పోడు భూముల సమస్య పరిష్కారం కాకుండా పోయిందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కోయలతో పోడు భూముల విషయం సమస్యగా మారిందన్నారు. ఎన్నికల కోడ్ కొన్ని పనులకు అడ్డంకిగా ఉందని.. లోక్సభ ఎన్నికలు పూర్తి కాగానే పనులు, సంస్కరణల్లో వేగం పెరుగుతుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు పోడు భూముల సమస్యకు కచ్చితంగా పరిష్కార మార్గం చూపిస్తామన్నారు.