కాంగ్రెస్ పార్టీలో ఫైర్బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి. అయితే తాజా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తాను గెలిచినప్పటికీ, టీఆర్ఎస్ ధాటికి కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో.. ఆయన సైలెంటైపోయారు. ఇక ఎలాంటి రాజకీయ విమర్శలు చేయబోనని, నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టిపెడతానని ప్రకటించారు. కేసీఆర్ అండ్ ఫ్యామిలీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోననీ స్పష్టం చేశారు. అయితే, ఆయన తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా కేసీఆర్పైనా కీలక వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన జగ్గారెడ్డి.. లాబీల్లో మీడియాతో ముచ్చటించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీకి మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. అలా జరిగితేనే ఏపీ ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడనీ, ఆయన మరోసారి సీఎం అయితేనే ఏపీ అభివృద్ధి ముందుకు సాగుతుందని చెప్పారు. అక్కడి ప్రజలు కూడా ఆయనపైనే నమ్మకంతో ఉన్నారన్నారు.
ఏపీలో టీడీపీ, తెలంగాణలో కాంగ్రెస్ బతికి ఉంటేనే ప్రజలకు మంచి జరుగుతుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అప్పుడు హోదా అడగని కేసీఆర్.. ఇప్పుడు హోదా గురించి మాట్లాడమేమిటని జగ్గారెడ్డి ప్రశ్నించారు.ఇక, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తే బాగుంటుందని జగ్గారెడ్డి అన్నారు. పార్టీ కూడా అదే కోరుకుంటోందన్నారు. అక్కడ రాహుల్కు పోటీగా బరిలో నిలిస్తే.. కేసీఆర్ కూడా ఓడిపోక తప్పదని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ బంపర్ మెజార్టీతో గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.