పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి గవర్నర్ కిరణ్ బేడీని తొలగించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఐదు రోజుల క్రితం చేపట్టిన ధర్నా కొనసాగుతూనే ఉంది. ఆదివారం తన ఇంటిపై నల్లజెండా ఎగురవేసి నారాయణస్వామి తీవ్ర నిరసన తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. గవర్నర్ బేడీ తీరుకు నిరసనగా కొద్దిరోజులగా నారాయణస్వామి నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. బేడీ వల్ల రాష్ట్రంలో సమస్యలు తలెత్తుతున్నాయని నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని కిరణ్బేడి జారీ చేసిన ఆదేశాలను సీఎం నారాయణస్వామి తప్పుబడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు హెల్మెట్ వాడకంలో ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని, అప్పటి వరకు దశలవారీగా ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ వాడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.