సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ జాగృతి నూతన సంకల్పానికి శ్రీకారం చుట్టింది. అవయవ దానం ద్వారా ఊపిరి ఆగిపోయే వారికి కొత్త ఊపిరినివ్వాలని ఈ నిర్ణయం తీసుకుంది. ఆదివారం హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో నిమ్స్ జీవన్ దాన్ తో తెలంగాణ జాగృతి ఒప్పందం చేసుకుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ కశ్మీర్లో సైనికులపై జరిగిన దాడి పట్ల కేసీఆర్ కలత చెంది తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవద్దని నిర్ణయించారని తెలిపారు.
తెలంగాణ జాగృతి అవయవ దానం కార్యక్రమం చేపట్టాలని ఈ మహా సంకల్పానికి శ్రీకారం చుట్టామని కవిత తెలిపారు. అవయవాలను దానం చేయడం ద్వారా మనిషి చనిపోయినా కూడా బతికి ఉన్న వాళ్లను చూసే అవకాశం కలుగుతుందని తెలిపారు. అవయవ దానంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. నిమ్స్ లో పోస్ట్ ఆపరేటివ్ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఇంటికి వెళ్లేంత వరకు ఆయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించే కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందని కవిత తెలిపారు