ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాళేశ్వరం పనులు పరిశీలించిన 15 ఆర్థిక సంఘం స‌భ్యులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 18, 2019, 12:13 AM

కాళేశ్వరం ప్రాజెక్టు పనులను 15వ ఆర్థిక సంఘం సభ్యులు పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఎల్లంపల్లి నుండి మేడారం రిజర్వాయర్ కు నీటిని తరలించేందుకు ప్యాకేజి 6 కింద నిర్మిస్తున్న అండర్ టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతంలో ఆదివారం 15వ ఆర్థిక సంఘం సభ్యులు పర్యటించారు. తొలుత భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. ధర్మారం మండలం నందిమేడారం వద్ద నిర్మిస్తున్న ప్యాకేజి 6 పనులను అడిగి తెలుసుకున్నారు. గోదావరి నదిలో రాష్ట్రానికి ఉన్న కేటాయింపుల నుండి ప్రతి రోజు 2 టీఎంసిల నీరు ఎత్తిపోసి 18.5 లక్షల ఎకరాల నూతన ఆయకట్టు, 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ మొత్తం సుమారు 36 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు, నీరు ప్రవహించే గ్రామాల తాగునీటి కోసం ఈ ప్రాజెక్టు అని అధికారులు ఆర్థిక సంఘ సభ్యులకు వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.5046కోట్ల వ్యయంతో ప్యాకేజి 6 పనులను ప్రారంభించి 95 శాతం మేర పనులు పూర్తి చేసామని, జూన్ 2019 నాటికి నూరు శాతం పూర్తి చేసేలా పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. ప్రతి రోజు 2 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన 7 పంపులకు గాను 4 పంపుల బిగింపు ప్రక్రియ పూర్తి చేసి డ్రై రన్ ను విజయవంతంగా నిర్వహించామన్నారు. మిగిలిన 3 పంపులను సైతం త్వరలో బిగించి ఏప్రిల్ చివరి వరకు వెట్ రన్ నిర్వహించేందకు సన్నహలు చేస్తున్నామన్నారు. జూన్ మాసం నాటికి పనులన్ని పూర్తి చేసి రైతులకు సాగునీరందించడమే లక్ష్యంగా 3 షిప్టుల్లో 24 గంటలు పనులు సాగుతున్నాయని అధికారులు వివరించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2 టీఎంసీలకు నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన ఎలక్ట్రో మెకానికల్ పనులు, 3 టీఎంసీలను తరలించడానికి అవసరమైన సివిల్ పనులు చేస్తున్నామని తెలిపారు.


 


అనంతరం ఎల్లంపల్లి నుండి మిడ్ మానేర్ జలాశయం వరకు నీటిని తరలించే లింక్ 2 పనుల పురోగతిని సైతం 15వ ఆర్థిక సంఘం సభ్యులకు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టు రుపొందించామని, రాష్ట్ర ఏర్పాటు తరువాత ఇప్పటి వరకు ప్యాకేజి 6 లో భాగంగా కాలువల్లో 10,63,117 క్యూబిక్ మీటర్ల మట్టి పని, అండర్ గ్రౌండ్ టన్నెలో 12,91,754 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 6,44,485 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రిట్ పని 2 సీఎం/సీడి పనులు, 4 పంపుల బిగింపు పనులు పూర్తి చేసామని చెప్పారు. ప్రాజెక్టు పనులను నిశితంగా పరిశీలించిన ఆర్థిక సంఘం బృంద సభ్యులు, దేశంలోనే భారీ నీటిపారుదల ప్రాజేక్టును అతి తక్కువ సమయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేస్తున్నదని అన్నారు. సాగునీటికి అత్యుత్తమ ప్రాధాన్యత కల్పిస్తు అద్భుతమైన డిజైన్ తో సాగునీటి రంగంతో పాటు మత్స్య పరిశ్రమ, టూరిజం సైతం పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ప్రశంసించారు. ప్రధాన కార్యదర్శి ఎస్ కే. జోషి, ఆర్థిక శాఖ ముఖ్య సెక్రటరీ కె. రామకృష్ణా రావు, ప్రభుత్వ సలహదారు జీఆర్. రెడ్డి, 15వ ఆర్థిక సంఘం బృందం సభ్యులు అశోక్ లహరి, రిటా లహరి, అరవింద్ మెహతా, రవికోటా, అంటోని సిరాయిక్, జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ఈ పర్యటనలో పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com