జమ్ము కశ్మీర్: భారత సైన్యం ఇద్దరు జైషే మహ్మద్కు చెందిన కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పుల్వామాదాడి కీలక సూత్రధారి జైషే మహ్మద్ కమాండర్ రషీద్ఘజీ, కమ్రాన్ను సైన్యం కాల్చి చంపింది. పుల్వమా జిల్లాలో పింగ్లాన్ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. గత వారంలో పుల్వామా సమీపంలోని అవంతిపురాలో జాతీయ రహదారిపై వెళుతున్న ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి చేసిన ఆదిల్ కు శిక్షణ ఇచ్చిన జైషే మహమ్మద్ కీలక ఉగ్రవాది ఘాజీ రషీద్ ను భారత సైన్యం కొద్దిసేపటి క్రితం మట్టుబెట్టింది. ఆత్మాహతి దాడి జరిగిన ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో గత రాత్రి నుంచి ఎన్ కౌంటర్ జరుగుతూ ఉండగా, ఓ ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించి, ఓ మేజర్, ముగ్గురు జవాన్లను, ఓ పౌరుడిని కాల్చిచంపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి, ఎన్ కౌంటర్ ప్రారంభించిన సీఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ భద్రతా దళాలు, ఘాజీ రషీద్ ను హతమార్చారు. మరణించింది రషీదేనని ఓ సైనికాధికారి స్పష్టం చేశారు. మరో ఉగ్రవాది ప్రాణాలతో పట్టుబడినట్టు తెలుస్తోంది. ఈ ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.