హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో ఏఐసీసీ నేత కొప్పుల రాజు జోక్యం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి అన్ని వ్యవహారాలను తనతోపాటు ఇంఛార్జి ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షుడు, స్థానిక నాయకులు అంతా కలిసి చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్టీకి సంబంధించి ఏఐసీసీ ఇంఛార్జి ప్రధాన కార్యదర్శిగా తనకు గానీ, పీసీసీ అధ్యక్షుడికి గానీ, స్థానిక నాయకులకు గానీ ఫిర్యాదు చేసినట్లయితే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. అలా కాకుండా కొందరు నేరుగా బహిరంగంగా విమర్శలు చేయడం క్రమశిక్షణా రాహిత్యం అవుతుందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్లో కొప్పుల రాజు జోక్యం ఎక్కువైందని, ఆయన్ను కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటూ రేణుకా చౌదరి సహా పలువురు నేతలు విమర్శలు చేసిన నేపథ్యంలో కుంతియా ఈ విధంగా స్పందించారు.