చంఢీఘడ్ : పుల్వామా ఉగ్ర ఘటన పంజాబ్ అసెంబ్లీలో చిచ్చు రేపింది. ఆ రాష్ట్ర మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూకు వ్యతిరేకంగా.. విపక్ష పార్టీలు ఫైరయ్యాయి. అకాలీదళ్ నేత బిక్రమ్ సింగ్ మజితా అసెంబ్లీ ఆవరణలో సిద్ధూ ఫోటోలను దహనం చేశారు. ఇటీవల పాకిస్థాన్కు సిద్ధూ వెళ్లారు. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఆ సమయంలో పాక్ ఆర్మీ జనరల్తోనూ సిద్ధూ ఫోటోలు దిగారు. ఆ ఫోటోలను అసెంబ్లీకి తీసుకువచ్చిన అకాలీనేత .. వాటిని అసెంబ్లీ బయట కాల్చేశాడు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. సభలోనూ మజితా నినాదాలు చేశారు. మంత్రి పదవి నుంచి సిద్ధూను తప్పించాలని డిమాండ్ చేశారు. పాక్ చర్యను ఖండిస్తారా లేదా అని ప్రశ్నించారు. సభలోనే ఉన్న సిద్ధూ.. మజితాకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో ఇద్దరి మధ్య సభలోనే వాగ్వాదం చోటుచేసుకున్నది. అకాలీదళ్, బీజేపీ సభ్యులు.. నల్లబ్యాడ్జీలు ధరించి సభలో సిద్ధూ వివరణ ఇవ్వకుండా అడ్డుపడ్డారు.