మున్సిపాలిటీల తీరు ఇక మారనుంది. ఆర్థికంగా పరిపుష్టం కానుండడంతో సమస్యలకు పరిష్కారం దక్కగలదన్న ఆశాభావం ఉంది. బడ్జెట్లో నిధులు పెరిగితే పురపాలికల్లో తాగునీటి, పారిశుద్య సమస్యలు తీరగలవని అధికారులు భావిస్తున్నారు. ఈ బడ్జెట్లో మున్సిపల్ కార్పొరేషన్లకు ప్రత్యేక నిధులు కేటాయించగలరన్న ఆశతో ఉన్నారు. దీంతో ప్రధాన సమస్యలకు పరిస్కారం దక్కగలదని భావిస్తున్నారు.అయితే ప్రధానంగా నిధుల సమస్య ఉన్నందున ఆ మేరకు నిధులు వస్తే మున్సిపాలిటీలు ముందుకు సాగలవని పలువురు చైర్మన్లు అన్నారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో రహదారులు, మార్కెట్లు, మరుగుదొడ్లు, పార్కులు, బస్ బేలు, బస్ షెల్టర్లు, శ్మశాన వాటికలు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటుపై మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో కేటీఆర్ గతంలో మంత్రిగా సవిూక్షించారు. ఈ సందర్భంగా ప్రధానంగా బడ్జెట్ లోటు ఉందన్న విషయం గుర్తించారు. అందుకు అనుగుణంగా ప్రణాళిక సిద్దంచేసి నిధులు విడుదల చేసేందుకు అంగీకరించారు. పట్టణాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చేందుకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కేటీఆర్ సూచించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణ, ఫుట్పాత్లు ఉండాలన్నారు. ప్రజావసరాల కోసం ప్రభుత్వ సంస్థల భూమిని నోటీసులు లేకుండానే వినియోగించుకునేందుకు గతంలో ఇచ్చిన సర్క్యులర్ను ఉపయోగించుకుని అవసరమైన చోట బస్బేలు నిర్మించాలని ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు చేస్తున్న తరహాలో రాష్ట్రంలోని మరో మూడు నగరాలకు రూ. 5కే భోజన పథకాన్ని విస్తరించనున్నామని కెటిఆర్ వెల్లడించారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లలో భోజన స్టాల్స్ ఏర్పాటుకు
స్థలాలు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కార్పొరేషన్ భవిష్యత్తు నివేదిక తయారు చేసుకోవాలని, దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేయాలని ఆదేశించారు. అన్ని పట్టణాల్లో శ్మశానాలను నిర్మించాలన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని, కూరగాయలు, మాంసం విక్రయాలకు మోడల్ మార్కెట్లు, మెకనైజ్డ్ కబేళాలు ఏర్పాటు చేయాలన్నారు