ఇంకా భూమి మీద నూకలు మిగిలినట్లున్నాయి ఆ నలుగురు వ్యక్తులకు. ఓ కారు వ్యవసాయ బావి అంచుల వరకు వెళ్లి ఆగింది. అదే కారు బావిలో పడి ఉంటే.. ఎంత ఘోరం జరిగేది. భయం కలిగించే ఈ యాక్సిడెంట్జ జగిత్యాల జిల్లాలో జరిగింది. రోడ్డు పక్కన ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకొచ్చిన కారు.. బావిలోకి సగం వరకు వచ్చింది. అదృష్టం కొద్ది ఆగిపోయింది.
గోదావరిఖనికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో జగిత్యాల నుంచి కరీంనగర్కు ఫిబ్రవరి 17వ తేదీ ఆదివారం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూడూరు దగ్గరకు కారు రాగానే.. అదుపు తప్పింది. రోడ్డు పక్కకు వెళ్లిపోయింది. అదే స్పీడ్ లో బావిలోకి దూసుకెళ్లింది. ఓమైగాడ్ అన్నట్లు.. కారు సగభాగం బావిపై వేలాడుతూ ఉంది. కారు ముందు సగ భాగం.. బావిలో ఉంది. మిగతాది బయట ఉంది. కారు టైరు కింద పెద్ద రాయి అడ్డుగా ఉండటంతో.. బావిలో పడకుండా సేఫ్ అయ్యారు. వెంటనే కారులోని వారు బయటకు వచ్చేశారు. దిగే సమయంలోనూ ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా.. కారు అమాంతం బావిలో పడేది. ఇంత ఘోర ప్రమాదం నుంచి బయటపడడంతో వారి కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రధాన రహదారులకు సమీపంలో వ్యవసాయ బావులుంటే కంచె వేయడం లేదా ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆల్ మోస్ట్.. చావు దగ్గరకు వెళ్లి వచ్చినట్లు ఉందంటున్నారు గ్రామస్తులు. చాలా అదృష్టవంతులు అంటున్నారు కారులోని వ్యక్తులను.