ట్రెండింగ్
Epaper    English    தமிழ்

10 మందితో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ- ఈసారి కూడా మహిళకు నో ఛాన్స్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 19, 2019, 02:04 AM

సీఎం కేసీఆర్ క్యాబినెట్ లో పది మంది కొలువుదీరనున్నారు. మంగళవారం జరిగే క్యాబినెట్ విస్తరణకు రావాల్సిందిగా కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ మేరకు రాజభవన్, సాధారణ పరిపాలనా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి ఎస్.నిరంజన్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, రంగారెడ్డి నుంచి సీ.మల్లారెడ్డి, నల్లగొండ నుంచి జీ.జగదీష్ రెడ్డి, అదిలాబాద్ నుంచి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి, నిజామాబాద్ నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, వరంగల్ నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు క్యాబినెట్ లో చోటు దక్కింది.


తొమ్మది మందిలో ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు ఇంతకు ముందే మంత్రి పదవులు నిర్వర్తించారు. నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సీ.మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, వి.శ్రీనివాస్ గౌడ్ తొలిసారి క్యాబినెట్ లోకి వస్తున్నారు. ఐదుగురు రెడ్డి కులానికి చెందిన వారు కాగా ఒకరు వెలమ, ముగ్గురు బీసీలు, ఒకరు ఎస్సీ మాల కులానికి చెందినవారు ఉన్నారు. గత ప్రభుత్వంలో మహిళకు క్యాబినెట్ లో చోటు దక్కకపోవడంలో ఈ సారి అయినా లభిస్తుందని మహిళా సభ్యులు ఎదురు చూసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. పార్లమెంటు ఎన్నికల తరువాత మలి విస్తరణలో మహిళకు చోటు దక్కవచ్చంటున్నారు. ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడం, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు గెలుపొందడం సీఎం కేసీఆర్ ను చికాకు పరిచింది. దీంతో ఈ జిల్లాకు క్యాబినెట్ లో ఈసారి ప్రాతినిధ్యం కల్పించలేదు. గత క్యాబినెట్ లో తుమ్మల నాగేశ్వర్ రావు మంత్రిగా ఉన్నారు. మెదక్ నుంచి సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com