హైదరాబాద్ : ప్రముఖ సినీ, రంగస్థల నటుడు డీఎస్ దీక్షితులు ఇవాళ కన్నుమూశారు. దీక్షితులు ఓ సీరియల్ చిత్రీకరణలో ఉండగా..ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను వెంటనే నాచారం ఆస్పత్రికి తరలించారు. దీక్షితులు అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు డాక్లర్లు వెల్లడించారు. ఆయన పూర్తి పేరు దీవి శ్రీనివాస దీక్షితులు. దీక్షితులు స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. మహేశ్ బాబు హీరోగా నటించిన మురారి చిత్రంలో దీక్షితులు పోషించిన పూజారి పాత్ర తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. దీక్షితులు వీటితోపాటు ఇంద్ర, ఠాగూర్, అతడు, వర్షం సినిమాల్లో తనదైన నటనతో అందరిని మెప్పించారు. దీక్షితులు తెలుగు, సంస్కృత భాషల్లో రంగస్థల కళల్లో ఎంఏ డిగ్రీలు పొందారు. రేపల్లెలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. ఆ తర్వాత లెక్చరర్ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్ కు వచ్చారు. ఏపీ థియేటర్ ఇనిస్టిట్యూట్ అండ్ రిపర్టీరీలో డిప్లొమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ లో చేరారు. దీక్షితులు డిప్లొమా చేస్తున్న సమయంలో పలు నాటకాలకు దర్శకత్వం వహించారు. ఆగమనం సీరియల్ కు గాను దీక్షితులు నంది అవార్డు అందుకున్నారు.