తన కేబినెట్ లో అసమర్థులకు మాత్రమే కేసీఆర్ చోటు కల్పిస్తారని తాను ముందుగానే చెప్పానని, ఇప్పుడు అదే జరుగుతోందని కాంగ్రెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన, కేటీఆర్ ను 'రామూ' అని పిలిచినందుకే తుమ్మల నాగేశ్వరరావు శాశ్వతంగా మాజీ అయిపోయారని అన్నారు. ఎంతో సీనియర్ అయిన కడియం శ్రీహరి, నాయిని నర్సింహారెడ్డిలను ఎందుకు పక్కనపెట్టాలో అర్థం కావట్లేదని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి అవినీతి వెనుకూ కేసీఆర్, కేటీఆర్ హస్తముందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేసి 40 మందికి పైగా జవాన్లను హత్యచేసినా, స్పందించేందుకు, వారికి నివాళులు అర్పించేందుకు కేసీఆర్ కు సమయం లేకపోయిందని విమర్శించారు.