హైదరాబాద్ : రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఇవాళ ఉదయం 11:30 గంటలకు జరగనుంది. మంత్రివర్గ విస్తరణకు రాజ్భవన్ వేదిక కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తాజా మంత్రివర్గ విస్తరణలో పదిమందికి చోటు కల్పించారు. వీరిలో గతంలో మంత్రులుగా పని చేసిన ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డితో పాటు కొత్తగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వీ. శ్రీనివాస్ గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. వీరందరి చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తరువాత కొత్త మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి నుంచి వచ్చే ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించిందీ వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీచేస్తుంది.