రాజ్భవన్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్.. వారితో ప్రమాణం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి విడతగా పదిమంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. సింగిరెడ్డి నీరంజన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వనపర్తి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా పనిచేసిన ఆయన గత కేబినెట్లో ఆర్ధిక, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. జగదీశ్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జగదీశ్ రెడ్డి.. గత కేబినెట్లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కేబినెట్లలో మంత్రిగా పనిచేసిన తలసాని .. కేసీఆర్ గత కేబినెట్లో పనిచేశారు. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. గత కేబినెట్లో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులలో ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, జగదీశ్ రెడ్డిలు గత కేబినెట్లో మంత్రులుగా పని చేశారు. ఇక నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డిలు కొత్తవారు. వీరిలో ఎర్రబెల్లి దయాకరరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. ధర్మపురి నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈశ్వర్ ఇప్పటికి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్గా బాధ్యతలు నిర్వర్తించారు.