ప్రమాణస్వీకారం చేసిన కొత్త మంత్రులకు మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సిఎం కేసీఆర్ ఎంతో నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను త్రికరణ శుద్ధితో నిర్వర్తించి ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా బంగారు తెలంగాణబాటలో పని చేస్తారని, తెలంగాణ ప్రజలు, అమరుల ఆశయాల సాధనకు పాటు పడతారని ఆశాభావం వ్యక్తం చేసారు. తనకు మంత్రి పదవి రాలేదన్న బాధ లేదని లక్ష్మారెడ్డి చెప్పారు.
తాను ఆది నుంచి టిఆర్ఎస్లో సిన్సియర్ కార్యకర్తగా పని చేస్తున్నానని లక్ష్మారెడ్డి చెప్పారు. కేసీఆర్ అనుయాయునిగా ఆయన మార్గ నిర్దేశనంలో పని చేస్తున్నామన్నారు.గతంలోనూ కేసిఆర్ సూచన మేరకు తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశామన్నారు. భవిష్యత్తులోనూ సిఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఇచ్చే ఏ బాధ్యతనైనా చిత్త శుద్ధితో నిర్వర్తిస్తామని చెప్పారు. ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని లక్ష్మారెడ్డి స్పష్టం చేసారు.