వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీనటుడు అక్కినేని నాగార్జున కలిశారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో అక్కినేని నాగార్జున జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నాగార్జునకు వైఎస్ జగన్ సాదర స్వాగతం పలికారు. అక్కినేని నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. వైఎస్ జగన్ చేపట్టబోయే బస్సు యాత్రలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ జగన్ ను అక్కినేని నాగార్జున కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపోతే సోమవారం జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నె శ్రీనివాసరావు కలిశారు. తాజాగా నాగార్జున కలవడం రాజకీయాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.