జమ్ము కశ్మీర్ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన 4 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు చెందిన రుణాలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. సైనికులంతా బ్యాంక్ ఖాతాదారులు కావటంతో వారికి డిఫెన్స్ శాలరీ ప్యాకేజీ కింద ఒక్కొక్కరికి రూ.30 లక్షల బీమా మొత్తాన్ని చెల్లించనున్నట్లు పేర్కొంది. బీమా మొత్తాన్ని వారి వారసులకు వెంటనే అందించనున్నట్లు తెలిపింది. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరందరికీ సాధ్యమైనంత వరకు తోడ్పాటునందించాలన్నది తమ ఉద్దేశమని బ్యాంక్ పేర్కొంది. కాగా వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు సాయమందించేందుకు భారత్ కే వీర్ పేరిట ఏర్పాటు చేసిన యూపీఐ ప్లాట్ఫామ్ ద్వారా నగదు మొత్తాలను బదిలీ చేయవచ్చని తెలిపింది.