పుల్వామా దాడి ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు విడిచిన ఈ విషాద ఘటనపై యావత్ భారతావనిలో పాకిస్థాన్పై ఆగ్రహజ్వాలలు ఎగసిపడ్డాయి. ఎన్నికలకు ముందు భారత్లో అల్లకల్లోలం సృష్టించడమే లక్ష్యంగా పాక్ సహకారంతో జైషే మహ్మద్ మరో రెండు ఆత్మహుతి దాడులు జరిపే అవకాశం ఉందని ఇంటిలిజన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. ఇప్పటికే పుల్వామా దాడికి సూత్రధారులుగా భావిస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కమాండర్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఘాజీ, కమ్రాన్ సహా మరొక తీవ్రవాదిని భద్రతా బలగాలు పుల్వామాకు 12 కిలోమీటర్ల దూరంలోని పింగ్లాన్ ప్రాంతంలో సోమవారం మట్టుబెట్టాయి. దాదాపు 18 గంటలపాటు సాగిన హోరాహోరీ కాల్పుల్లో ఆ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో నలుగురు సైనికులు, ఓ పోలీసు అధికారి, ఒక పౌరుడు కూడా మృతి చెందినట్లు ప్రభుత్వం ప్రకటించింది. పుల్వామా దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్న భద్రతా సంస్థలకు కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. ఎన్నికలకు ముందు దేశంలో మూడు చోట్ల ఆత్మహుతి దాడులు జరపాలని జైషే మహమ్మద్ సంస్థ ప్లాన్ చేసినట్లు ఇంటిలిజెన్స్ గుర్తించింది. ఇందులో భాగంగానే పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగినట్లు గుర్తించింది. దీనికి సంబంధించి పక్కా ప్లాన్ను పాకిస్థాన్లో రెడీ చేసినట్లు ఇంటిలిజెన్స్కు సమాచారం అందింది. ఇదే సమయంలో గత డిసెంబరులోనే 21 మంది ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించినట్లు సమాచారం. వీరి ద్వారానే ఆత్మహుతి దాడులు జరపాలని ఉగ్రవాద సంస్థ నిర్ణయించింది. దీంతో ఈ ఉగ్రవాదులను కనిపెట్టి మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇంటిలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్లోని కీలక ప్రాంతాలతోపాటు ఐటీ కారిడార్ ప్రాంతంలో నిఘాతోపాటు భద్రతను పెంచారు. ముంబయి. వారణాసి, పుణె, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ, లక్నో, కోల్కత్తా ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు.