తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన 2నెలల తర్వాత.. మంత్రివర్గాన్ని విస్తరించారు కేసీఆర్. సీఎం అభీష్టం మేరకు 10 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో కేసీఆర్తో పాటు ప్రమాణం చేసిన మహ్ముద్ అలీతో కలిపి.. మొత్తం తెలంగాణ అమాత్యుల సంఖ్య 11కు చేరుకుంది. తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు కూడా జరిగిపోయింది. అయితే, ప్రధానమైన శాఖలు మాత్రం కేసీఆర్ ఎవరికీ ఇవ్వలేదు. ముఖ్యంగా గతప్రభుత్వంలో ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తించిన ఈటెల రాజేందర్కు ఈ దఫా వైద్య ఆరోగ్యశాఖను కేటాయించారు కేసీఆర్. ఈటెలతో పాటు మిగితా తొమ్మిది మంది మంత్రులకు శాఖలను కేటాయిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆర్థికశాఖను మాత్రం ఎవ్వరికీ కేటాయించకుండా తనదగ్గరే పెట్టుకున్నారు. దీంతో ఈనెల 21న అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ఓటాన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నట్టు స్పష్టమవుతోంది. అసెంబ్లీ బడ్జెట్ సెషన్కు ముందే మంత్రి విస్తరణ చేపట్టాలని కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో.. ఆర్థికశాఖను ఇతరులకు కేటాయించే అవకాశం ఉందని భావించారు. అయితే, ఈ సారి ఓటాన్ బడ్జెట్ స్వయంగా తానే ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఆర్థికశాఖను తన దగ్గరే అట్టిపెట్టుకున్నారనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నారు.