తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారక్క పూజారులు నేడు మండ మెలిగే పండుగను నిర్వహించనున్నారు. సమ్మక్క పూజామందిరంలో సిద్దబోయిన వంశస్థులు, సారక్కగుడిలో కాక వంశీయులు ఆలయాలను, అమ్మవార్ల పూజాసామగ్రిని శుద్ధిచేస్తారు. మందిరాల్లోని గద్దెలను ఆడపడుచులు పుట్టమట్టితో అలికి ముగ్గులు వేస్తారు. అనంతరం ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్ ఇంటి నుంచి డోలు వాయిద్యాల నడుమ మామిడి తోరణాలు, పసుపు, కుంకుమలు ఊరేగింపుగా తీసుకొని గ్రామదేవత, బొడ్రాయిల వద్ద ప్రత్యేకపూజలు చేస్తా రు. బుధవారం నుంచి నాలుగురోజులపాటు ఆయాగ్రామాల్లోని పూజామందిరాల్లో అమ్మవార్ల పూజారులు అత్యంత నియమనిష్టలతో పూజలు చేస్తారు. అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం మినహా మిగతా పూజాకార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయి.