రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో అర్హులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇళ్లకు సంబంధించిన అన్ని విషయాలు మావద్ద ఉన్నాయి. ఇళ్ల గురించి ఎవరికీ డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. దళారుల మాటలు నమ్మొద్దు. అని ప్రజలను కోరారు. ఇళ్లు లేనివాళ్లు ఉండకూడదనేది సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 3,052 మంది లబ్ధిదారులకు కేటీఆర్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. మిగతా 248 మందికి కూడా త్వరలోనే పట్టాలు ఇస్తామన్నారు. సిరిసిల్లలో త్వరలోనే రూ.200కోట్లతో రహదారి, భూగర్భ కాల్వల పనులు చేపడతాం. పేదరికం తొలగించేందుకు చర్యలు చేపట్టాం. సిరిసిల్ల చేనేతకారులు తయారు చేసిన బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నాం. బతుకమ్మ చీరల్లో మరిన్ని డిజైన్లు తీసుకు వస్తాం. నేతన్నలకు, మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాం. సిరిసిల్ల నియోజకవర్గానికి జలకళ రాబోతుంది. ఐదేళ్లలో సిరిసిల్లను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్ది.. రాష్ట్రంలోనే నంబర్వన్గా మారుస్తా. అపూర్వమైన విజయాన్ని నాకు అందించిన సిరిసిల్ల ప్రజల రుణం తీర్చుకోలేనిది. సీఎం కేసీఆర్ కార్యదక్షత వల్లే సిరిసిల్లకు చెందిన బీడీ, నేతకార్మికుల 40ఏళ్ల కల నెరవేరుతోంది. జీవో నెం.58 కింద లక్షా 25వేల మందికి పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ది. ప్రతి ఇంటికీ నల్లా నీరందిస్తాం. దేశం మొత్తం అబ్బురపడేలా రాష్ట్రంలో డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతోందని కేటీఆర్ పేర్కొన్నారు.