ఈనెల 22 తేదీ నుండి జరగనున్న తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాల భద్రత ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. స్పీకర్ చాంబర్ లో జరిగిన ఈ సమావేశానికి శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి డా. నరసింహ చార్యులు, డిజి తేజ్ దీప్ కౌర్, ఇంటలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ అంజనా కుమార్, సైబరాబాద్, రాచకొండ కమీషనరేట్ పోలీసు అధికారులు, ట్రాఫిక్, అగ్నిమాపక శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ...శాసనసభ సమావేశాలు ఈనెల 22 నుండి 25 వరకు జరుగుతాయి. మొత్తం 3 రోజులు శాసనసభ సమావేశం ఉంటుంది. అందరి సహకారంతో శాసనసభ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని అన్నారు. గతంలో మాదిరిగా అందరి సహకారం కొనసాగాలి. శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా జరగడంలో పోలీసు శాఖది కీలక బాధ్యత. దీనికోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ సూచించారు. శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్ మాట్లాడుతూ సమావేశాలకు ముందు పోలీసు అధికారులతో సమావేశం జరపడం ఆనవాయితి. సమావేశాలు శాంతియుతంగా జరపడానికి అందరి సహకారం అవసరమన్నారు.